Nashamukt Bharat నారాయణఖేడ్: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మానసికంగా, శారీరకంగా దృఢమైన యువత అవసరమని, అది డ్రగ్స్ లేని సమాజంతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశాముక్త్ భారత్’ (మత్తు రహిత భారతం) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిస కాకూడదని, అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని పిలుపునిచ్చారు.

Nashamukt Bharat
విద్యార్థులు సోషల్ మీడియా వ్యామోహంలో పడకుండా, తమ లక్ష్యాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. లక్ష్య సాధన కోసం విద్యార్థులు నిరంతరం విద్యా అధ్యయనం చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణరావు, చంద్రశేఖర్ ఆచార్య, ధన్సింగ్, హమీద్ పాల్గొన్నారు. అలాగే బ్రహ్మకుమారి సమాజం సభ్యులు లక్ష్మీదీది, రామచంద్రరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.