మెదక్ జిల్లా Ration Scam : పౌరసరఫరాల శాఖ సేవలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) నిత్యానంద్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం వేల్పుగొండలోని రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Ration Scam 36 క్వింటాళ్ల బియ్యం మాయం
వేల్పుగొండ గ్రామంలోని రేషన్ షాప్ (నంబర్: 1708004) లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా షాపులోని రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు మరియు భౌతిక నిల్వలను సరిచూడగా, భారీ అక్రమాలు వెలుగుచూశాయి. డీలర్ దినకర్ వద్ద ఉండాల్సిన నిల్వల్లో 36.32 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన నిత్యానంద్.. సదరు డీలర్పై ఈసీ యాక్ట్ 1955 (E.C. Act 1955) నిబంధనల ప్రకారం 6-A కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

డీలర్లకు హెచ్చరిక
ఈ సందర్భంగా డీఎస్ఓ నిత్యానంద్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ సేవలను పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు, మార్గదర్శకాలు మరియు సమయపాలనను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని కార్డుదారులకు ఎలాంటి అవకతవకలు లేకుండా పంపిణీ చేయాలి. భవిష్యత్తులో ఏ డీలర్ అయినా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.