Paddy Procurement Center : రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని చంద్రుతండా సర్పంచ్ స్రవంతి సర్ధార్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని చంద్రుతండాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు లేదా దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది సాయిలు, వేణుగోపాల్, సొసైటీ మాజీ డైరెక్టర్ చందర్, కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ తదితరులు పాల్గొన్నారు.