Bethala Swamy Jatara : మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో కొలువుదీరిన బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి రక్షగా ఉన్న బేతాళుడికి జాతర నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. జాతరను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తండోప తండాలుగా తరలి వచ్చారు. దీంతో బేతాళ స్వామి ఆలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. రంగు రంగుల వస్త్రాలు, పచ్చని తోరణాలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు.

అల్లాదుర్గం, వెంట్రావుపేట, రెడ్డిపల్లి, బహిరన్ దిబ్బ, పెద్దశంకరంపేట తదితర ప్రాంతాల నుంచి భక్తులు తీసుకువచ్చిన ఎడ్ల బండ్లను స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఈ జాతరకు జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. స్వామిని నమ్ముకున్న భక్తులకు వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రేణుకారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Bethala Swamy Jatara
