INSPIRE Awards : భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక INSPIRE Awards – MANAK (Million Minds Augmenting National Aspirations and Knowledge) కు మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని PM SHRI ZPHS కుసంగి పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు.
INSPIRE Awards మండలం నుండి ఏకైక పాఠశాల
ఈ ఏడాది టేక్మాల్ మండలం నుండి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కేవలం ‘కుసంగి‘ పాఠశాల మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బుస్సా రాంచరణ్ తన వినూత్నమైన ఆలోచనతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
రూ. 10,000 ఆర్థిక సహాయం
సమాజంలోని సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపేలా విద్యార్థి చూపిన సృజనాత్మకతకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఎంపికైన ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడానికి మరియు సైన్స్ నమూనాను (Model) తయారు చేయడానికి భారత ప్రభుత్వం రాంచరణ్కు రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేయనుంది.
అభినందనలు
ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థి రాంచరణ్ మరియు అతడికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్ ఎం. మురళి ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రసన్నవదన అభినందించారు. ఈ సందర్భంగా కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, ఉపసర్పంచ్ సుబ్బారావు, మరియు AAPC చైర్మన్ సావిత్రమ్మ పాఠశాలను సందర్శించి విద్యార్థిని ప్రశంసించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెరగాలని, భవిష్యత్తులో రాంచరణ్ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.