కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. అయితే, తాజాగా రాబోయే 22వ విడత నిధులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. సుమారు 74 లక్షల మంది రైతులకు ఈ విడత నిధులు అందకపోవచ్చని తెలుస్తోంది.
ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు తమ ఖాతాలకు సంబంధించి కొన్ని కీలక ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ లక్షలాది మంది రైతులు ఇంకా వీటిని పూర్తి చేయకపోవడమే ఈ భారీ సంఖ్యలో రైతులు అనర్హులుగా మారడానికి కారణమని సమాచారం.
ముఖ్యమైన కారణాలు ఇవే?
ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్: పీఎం కిసాన్ PM Kisan పోర్టల్లో ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. చాలా మంది రైతులు ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు.
భూ రికార్డుల ధృవీకరణ (Land Seeding): రైతుల భూమికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం వల్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.
బ్యాంక్ ఖాతా అనుసంధానం: ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతా లింక్ అవ్వకపోవడం (Aadhaar Seeding) కూడా ప్రధాన అడ్డంకిగా మారింది.
తప్పుడు వివరాలు: గతంలో నిధులు పొందిన వారిలో కొందరు అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు లేదా తప్పుడు పత్రాలు సమర్పించిన వారిని ఈ జాబితా నుండి తొలగిస్తున్నారు.
PM Kisan రైతులు ఏం చేయాలి?
నిధులు ఆగిపోకుండా ఉండాలంటే రైతులు ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in సందర్శించండి. లేదా తమ సమీపంలోని ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలి. అలాగే, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో ఒకసారి సరిచూసుకోవాలి.
ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేయడంతో, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. కాబట్టి రైతులు సకాలంలో స్పందించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.
ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలి.