Kalvakuntla Kavitha New Party తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న (మార్చి 27, 2026) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె తన నూతన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Kalvakuntla Kavitha New Party : ‘తెలంగాణ ప్రజా జాగృతి’
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ‘తెలంగాణ జాగృతి’ వేదికగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కవిత, తన రాజకీయ పార్టీకి “తెలంగాణ ప్రజా జాగృతి” అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 27వ తేదీ పార్టీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఉద్యమకారులకు, యువతకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.
సిద్దిపేట నుంచే పోటీ?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతానని కవిత ఇప్పటికే వెల్లడించారు. పార్టీని ప్రకటించే రోజే తన పోటీపై కూడా అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.