TGUEEU Demands : తెలంగాణ ట్రాన్స్కో (TG TRANSCO)లో పనిచేస్తున్న ఆర్టిజన్, ఓ&ఎమ్ (O&M) మరియు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (TGUEEU – CITU) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సంగారెడ్డి SE/OMC కి వినతి పత్రాన్ని అందజేశారు.
TGUEEU Demands : ప్రధాన డిమాండ్లు
- PRC 2026 కమిటీ: తక్షణమే పీఆర్సీ 2026 కమిటీని ఏర్పాటు చేయాలి.
- పదోన్నతులు: 2021-22 బ్యాచ్కు చెందిన జేఎల్ఎమ్ (JLM) కార్మికులకు సీనియార్టీ ప్రకటించి పదోన్నతులు కల్పించాలి.
- వేతన సవరణ: ఎస్ఎన్జీ, టీఆర్ఈ, యంత్రాడీల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు తగ్గించిన వేతనాలను పునరుద్ధరించాలి. సిబిడి ఆర్టిజన్ వర్కర్లకు గ్రేడ్-1 సమాన వేతనాలు ఇస్తూ పాత బకాయిలు (Ariyars) చెల్లించాలి.
- అలవెన్సులు: 400 కేవీ, 220 కేవీ సబ్ స్టేషన్లలో పనిచేసే వారికి ‘రిస్క్ అలవెన్స్’ లేదా ‘షిఫ్ట్ రిస్క్ అలవెన్స్’ అందించాలి. హాట్ లైన్స్లో పనిచేసే కార్మికులకు గుత్త వేతనాన్ని రద్దు చేసి ఓ&ఎమ్ కార్మికులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలి.
- మౌలిక సదుపాయాలు: మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక మెడికల్ లీవులు మంజూరు చేయాలి.
- కొత్త నియామకాలు: ట్రాన్స్కోలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, పనిభారం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
పెండింగ్లో ఉన్న ఆర్టిజన్ వర్కర్లను వెంటనే విలీనం చేయాలని, విద్యా అర్హత కలిగిన వారికి అర్హతను బట్టి పోస్టింగ్లు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కాటం మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. స్వప్న, ప్రధాన కార్యదర్శి ఎ. మధుసూధన్, పల్లె శ్రీకాంత్, జాకీర్, ఈశ్వరయ్య, కిష్టయ్య, తదితరులు ఉన్నారు.
