అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు కవయిత్రి మంజుల పత్తిపాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ “ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే, ఈ రోజు ప్రతి మహిళా నిజంగా సంతోషంగా జరుపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయమై ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలన్నారు. చాలా సందర్భాల్లో మహిళకు మహిళే శత్రువుగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. జీవితంలో కొందరు ఎదుర్కొన్న కష్టాల విషాన్ని మరో సాటి మహిళపై చిమ్ముతున్నారని చెప్పారు. సంతోషంగా ఇంటికి అడుగుపెట్టిన మహాలక్ష్మిని వరకట్న దాహంతో బాధపెట్టి, కన్నీళ్లు పెట్టించే మహిళలు కూడా మన సమాజంలో ఉన్నారన్నారు. గ్యాస్ ఉన్న రోజుల్లో కూడా కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు, అత్త, ఆడపడుచుల కాళ్లు పట్టి, వాళ్లు పడుకున్న తర్వాతే పడుకున్న మహిళలు ఉన్నారు. నిండు గర్భిణీ అయినా కూడా నీళ్ల బిందెలు మోసిన మహిళలు ఉన్నారు. ఆ కష్టాలన్ని పోవాలి అంటే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం కాదు ముందుగా మనం మారాలని అని అన్నారు.
కన్నీరే విప్లవాన్ని మేల్కొల్పింది
నా జీవితంలో కన్నీరు పొంగిన ప్రతి క్షణం నా గుండెల్లో ఒక విప్లవాన్ని మేల్కొలిపింది. ఆ కన్నీరు రుధిరసిరలుగా మారి కవితల రూపంలో మీ ముందుకు వచ్చింది అని అన్నారు. మహిళలకు మగవాడు శత్రువు కాదు. చాలాసార్లు మనకు మనమే శత్రువులమైపోతున్నాం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక విషపు నాగులను తయారు చేస్తున్నాం. మహిళ నిజంగా సంతోషంగా ఉండాలి అంటే ముందుగా సాటి మహిళ మారాలి. మహిళ మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. అప్పుడు మగవారు కూడా మారుతారు అని అన్నారు. అప్పుడు ప్రతి ఇంట్లో… ప్రతి రోజూ… మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అవుతుంది.” అని అన్నారు.