ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ ఓ ఆర్టీసీ బ‌స్సు(RTC Bus) అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్‌తో స‌హా ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఉట్నూరు మండ‌లంలోని షాంపూర్ వద్ద నేడు (సోమవారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు క‌ల్వ‌ర్టును ఢీకొట్టి అదుపు త‌ప్పి వాగులో ప‌డిపోయింది. వెంట‌నే స్థానికులు అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 37 మంది ప్ర‌యాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. బ‌స్సు ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.